మూడు ముళ్ళు ఏడు అడుగులు ఒకటైన రెండు మనసులు ఎంతో ఆనందంగా అతడితో జీవితాన్ని పంచుకోవాలని కోటి ఆశలతో వచ్చింది గోమతి. ఆశలు అడియాశలు అయ్యాయి కట్టుకున్నవాడే కాల యముడై కడతేర్చాడు ముక్కుపచ్చలారని పసికందు చూస్తుండగానే భార్యను కానరాని లోకాలకు పంపాడు. చిన్న చిన్న మనస్పర్థలతో తరచూ గొడవలు పడుతూ ఆమెకు నరకం చూపించాడు. చివరకు ప్రాణాలు కూడా తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరువల్లూరు జిల్లా పొన్నేరికి చెందిన ధీరజ్ కు 2015లో చిత్తూరు జిల్లా కార్వేడు మండలం నన్నూరి కి చెందిన సమీప బంధువు గోమతి తో వివాహమైంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఓ ఫార్మసీ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు ధీరజ్. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ప్రతిచిన్న విషయానికి భార్యతో గొడవపడేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఉదయం 11గంటల సమయంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. జిమ్లో వ్యాయామానికి ఉపయోగించే రబ్బరు పరికరాన్ని గోమతి మెడకు వేసి బిగించాడు. దీంతో గోమతి అక్కడికక్కడే మృతి చెందింది.
చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అత్తమామలకు ఫోన్ చేసి మీ అమ్మాయి నాతో గొడవపడి బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుంది అని కట్టుకథలు చెప్పాడు. చుట్టుపక్కల వారిని కూడా తన భార్య ఉరివేసుకుని చనిపోయినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. గోమతి తల్లిదండ్రులు వచ్చేలోపే సొంత ఊరైన తమిళనాడుకు గోమతి మృతదేహాన్ని తరలించాడు. ఆమె బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.
Also watch :