తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్. ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల నిర్మాత విష్ణు ఇందూరి భారీ బడ్జెట్తో జయలలిత బయోపిక్ను తెరకెక్కిస్తున్నారు. ఇక జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జయలా కనిపించేందుకు కసరత్తులు ప్రారంభించారు. జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎమ్జీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేశారు.
రోజా, బొంబాయి వంటి మూవీలతో యూత్ను బాగా ఎంటర్టైన్ చేశారు హీరో అరవిందస్వామి. ఆ తరువాత విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విజయవంతగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ధృవ సినిమాలో అరవింద స్వామి విలన్ గా మెప్పించారు. విలన్ వేషంలో తన నటనతో సినిమాను రక్తి కట్టించారు అరవింద స్వామి. ఇప్పుడు ఎమ్జీఆర్ పాత్రలో ఆయన నటించనున్నారు.