టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ మోత మోగించాడు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతోపాటు భారీ స్కోర్ సాధించిన రోహిత్ రెండో ఇన్నింగ్స్ లోను సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. శనివారం నాల్గో రోజు ఆటలో మయాంక్ అగర్వాల్(7) నిరాశపరిచినప్పటికీ రోహిత్ మాత్రం నిలదొక్కుకున్నాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లలో శతకం పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ కూడా తడబడకుండా సమయోచితంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు.
ఓపెనర్గా తొలి టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. 1982 సీజన్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లెర్ వెసెల్స్ ఓపెనర్గా ఆడిన తొలి టెస్టులో 208 పరుగులు నమోదు చేశాడు. ఇక ఒక టెస్టులో కనీసం రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అంతకుముందు విజయ్ హజారే, సునీల్ గావస్కర్(మూడుసార్లు), రాహుల్ ద్రవిడ్( రెండుసార్లు), కోహ్లి(ఒకసారి), రహానే(ఒకసారి) ఈ రికార్డును సాధించారు.