ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఉదయాన్నే డిపో ముందు ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 15రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు కూడా మద్దతు పలికాయి. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి.. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా బస్సు డిపోల ముందు పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. భద్రత మధ్య ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.
శుక్రవారం సమ్మెపై హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిష్కారం చూపకపోతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. కార్మికులతో శనివారం చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ ఉదయం పదిన్నరకు ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని చెప్పింది. 3 రోజుల్లో సంప్రదింపులు పూర్తి చేయాలని తెలిపింది. చర్చల వివరాలను 28లోపు ధర్మాసనానికి తెలిపాలని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.