మొబైల్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు వొడాఫోన్ రంగంలోకి దిగింది. జియోతో తలపడుతున్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నడుస్తోంది. జియో ఇటీవల ఐయూసీ కాలింగ్ నిమిషాలతో మూడు కొత్త ఆల్ ఇన్ వన్ ప్యాక్లు.. రూ.222, రూ.333, రూ.444లను విడుదల చేసింది. దీంతో వొడాఫోన్ రూ.229తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. జియో రూ.222 ప్లాన్లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్వర్క్లకు కాల్ చేసేందుకు 1,000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి. జియో కంటే రూ.7లు ఎక్కువే అయినా వొడాఫోన్ ప్లాన్లో వినియోగదారులు ఏ నెట్వర్క్కు అయినా దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు ఉచితంగా పంపుకోవచ్చు. ఇవి కాకుండా వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఉచితంగా లైవ్ టీవీ, సినిమాలు కూడా చూడవచ్చు. కాగా వొడాఫోన్ గతంలో ప్రవేశపెట్టిన రూ.255 ప్లాన్ను రద్దు చేసింది. కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.229 ప్లాన్ దానికి దగ్గరగా ఉండడమే ఇందుకు కారణం.