వంద మీటర్ల రేస్ అది. ఎవరు త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటే వారికే 20 వేల రూపాయల ఫస్ట్ ప్రైజ్. అయితే ఇది పూర్తిగా శునకాల కోసమే పెట్టిన రేస్. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాగుంట స్వయంభూ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో.. ఈ వెరైటీ డాగ్ రేస్ నిర్వహిస్తున్నారు. పాగుంట ఉత్సవాల్లో మొదటిసారిగా శునకాలకు రేస్ పెట్టారు. దీనికోసం 11 జతల శునకాలను న్యాయనిర్ణేతలు ఎన్నుకుని పోటీలు ప్రారంభించారు.
ఈ డాగ్ రేసులో మొదటి విజేతగా నిలిచిన శునకానికి 20 వేలు, రెండో బహుమతిగా 15 వేలు, మూడో బహుమతిగా 10 వేల రూపాయలు నిర్ణయించారు. మైదానంలో వంద మీటర్ల లక్ష్యాన్ని ఏ శునకం ముందుగా పూర్తి చేస్తుందో దాన్ని విజేతగా ప్రకటిస్తారు. ఈ వెరైటీ రేసులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి యజమానులు తమ శునకాలతో తరలివచ్చారు.