తూర్పుగోదావరి జిల్లాలో హనీట్రాప్ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య స్థలవివాదాన్ని సెటిల్ చేయడానికి యువతితో ట్రాప్ చేసిన ఘరానా మోసాన్ని సామర్లకోట పోలీసులు బట్టబయలు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన చాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.
జి.మామిడాడలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో ఓ ఛానల్ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్లో పని చేస్తున్న రాకేష్తో భార్యా భర్తలైన మహేష్, అశ్వినిల సహకారం తీసుకుని కేదారమణికంఠరెడ్డిని అశోక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేశారు.
అశ్విని ఫోన్లో మాయమాటలు చెప్పి మణికంఠరెడ్డి వచ్చేలా చేసింది. వీళ్లిద్దరూ గదిలోకి వెళ్లిన వెంటనే ముఠా సభ్యులు వీడియో చిత్రీకరించారు. వీటిని చూపి మణికంఠరెడ్డిని బెదిరించారు. అప్పటికీ అతడు లొంగకపోవడంతో కుర్చీకి కట్టి చిత్ర హింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు.
మణికంఠరెడ్డి వద్ద ఉన్న 63 వేల నగదు, బంగారు ఆభరణాలు, తెల్లకాగితంపై వేలి ముద్రలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు మణికంఠరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనలో పలువురు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులు దుర్గారెడ్డి, రాకేష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.