తెలంగాణ గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటన చేపట్టారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాలో పర్యటించారు. హన్మకొండలోని రెడ్క్రాస్లో తలసేమియా బాధితుల కోసం అదనపు బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు . రాష్ట్ర ప్రభుత్వం తలసేమియా వ్యాధిని ఆరోగ్యశ్రీ ఎంపానెల్మెంట్లో చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ఇన్సూరెన్స్ స్కీములు అయిన ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భవ పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని, ఆ దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం అక్కడి నుంచి వేయిస్తంబాల ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భద్రకాళి టెంపుల్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఖిలా వరంగల్లో సౌండ్స్ అండ్ లైట్ షో ద్వారా కాకతీయ రాజుల గొప్పతనాన్ని తెలుసుకున్నారు. రాత్రి హన్మకొండలోని హరిత హోటల్లో బస చేశారు.
వరంగల్ పర్యటనకు ముందు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను గురించి గవర్నర్కు వివరించారు.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. తర్వాత ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. బుధవారం రామగుండంలోని ఎన్టీపీసీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల కళరియపట్టు మర్మకళ ప్రద్శనను తిలకించనున్నారు. అనంతరం నందిమేడారంలోని నంది పంప్హౌస్ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు పయనం కానున్నారు.