ఏపీలో కాల్మనీ వ్యాపారుల ఆగడాలు మితీమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో కాల్మనీ వ్యాపారుల టార్చర్ తట్టుకోలేక.. పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ యవకుడు. ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ 6 లక్షల అప్పు చేశాడు. అప్పు ఇచ్చినపుడు... మూడు రూపాయల వడ్డీ అన్నవాళ్లు.. ఆ తర్వాత 12 రూపాయలు వసూలు చేశారు. ఇలా.. 6 లక్షల అప్పుకి.. 23 లక్షల్ని వడ్డీ రూపంలో కట్టించుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కాల్మనీ వ్యాపారులపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వెంకటేష్ అంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారని బాధితుడు తెలిపాడు. పోలీసుల నిర్లక్ష్యం చేయడంతో.. తాడేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు నివారించడంతో ప్రాణాపాయం తప్పింది.