నెల్లూరులో సీఐటీయూ రాష్ట్ర 15వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్తోపాటు పలువురు కమ్యూనిస్టు నాయకులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చే నెల 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
కదం తొక్కిన ఎర్రదండుతో నెల్లూరు అరుణారుణ వర్ణమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక,కర్షకుల మధ్య సీఐటీయూ రాష్ట్ర 15వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10వేలమందితో కామ్రేడ్లు కవాతు నిర్వహించారు. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ సిఎం మానిక్ సర్కార్తోపాటు దేశంలోని కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర సర్కార్ తీరుపై మానిక్ సర్కార్ విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చెప్పారు. ధరలు పెరిగి ఉత్పాదక రంగం దివాలా తీసిందన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సంపద సృష్టికర్తలైన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.