ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య రాజధాని భూములు, ఆస్తుల వివాదం రగులుతూనే ఉంది. అమరావతి ఏర్పాటులో ఎన్నో అక్రమాలు జరిగాయన్న అధికార పార్టీ ఆరోపణలకు ప్రతిపక్ష నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. జగన్ జీవితమంతా బినామీ బతుకేనంటూ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన ఉండే ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, చివరికి వాహనాలు కూడా బినామీ పేర్ల మీదే ఉన్నాయన్నారు. రాజకీయ జీవితంలోకి వచ్చాక ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో, ఎవరి ఆస్తులు తగ్గాయో ప్రకాశం బ్యారేజీపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు పయ్యావుల.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. 2016లో రాజధానిలో భూములు కొనుగోలు చేశానని తెలిపారు. నంబూరి దగ్గర భూములు కూడా ట్రేడింగ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విచారణ అయినా చేసుకోవాలని సవాల్ విసిరారు.
రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ.. అందులో తన పేరు లాగడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు. తనకు అక్కడ ఒకే ఒక ఎకరం భూమి ఉందని.. అది కూడా 2006 జులైలో కొన్నదని ఆయన తెలిపారు.
రాజధాని అమరావతికి చంద్రబాబే శాపం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బినామీ భూముల విలువ పడిపోతుందనే చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు. తన కుటుంబానికి నీరుకొండలో 5 ఎకరాలున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు అధికార పార్టీ గట్టిగా చెబుతోంది. అయితే..అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాంటూ ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. 3 తరాల ఆస్తులపై కూడా చర్చకు రెడీ అంటోంది ప్రతిపక్షం.