రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్డ్యాంలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో చిన్ననీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం... ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలో లెక్కలు తీయాలని సూచించారు. అవసరమైన చెక్ డ్యాములను గుర్తించిన తర్వాత సగం ఈ ఏడాదే నిర్మించాలని.. దాని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలన్నారు. మిగతా సగం చెక్ డ్యాములను వచ్చే ఏడాది నిర్మించాలని వాటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించుకున్నామని.. వాటి కట్టలు, తూములు, కాల్వలు మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వల్ల గోదావరి నుంచి మన వాటా ప్రకారం పుష్కలమైన నీటిని తీసుకుంటామని.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా నీళ్లు వస్తాయని కేసీఆర్ వివరించారు. గోదావరి నీళ్లతో ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నింపుకుని.. రాష్ట్రంలోని అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తామని వెల్లడించారు. వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందకి వెళ్లిపోయే వర్షపు నీళ్లను ఎక్కడిక్కడ ఆపడానికి చెక్డ్యాములు నిర్మించాలని కేసీఆర్ ఇరిగేషన్ ఆదేశించారు.