మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి ప్రత్యేక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలని సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ పరిధిలో రెబ్ ఎమ్మెల్యే వంశీ, గిరిధర్ వచ్చారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహ రచన చేయనున్నారు.
టీడీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్య నేతలతో స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు అధినేత చంద్రబాబు. మండలిలో తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం బిల్లును ఏ రూపంలో తెస్తుంది, అందుకనుగుణంగా ఎలాంటి వ్యూహ రచన చేయాలన్నదానిపై చర్చించనున్నారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు. సీఆర్డీఏపై మనీ బిల్ పెడితే ఏం చేయాలన్న దానిపైనా వ్యూహరచన చేస్తారని సమాచారం.