గణతంత్ర దినోత్సవం సందర్బంగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్పథ్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.... మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీతోపాటు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు అతిథులు జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు.
జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు... ఇండియా గేట్ సమీపంలోని... నేషనల్ వార్ మెమోరియల్ను... రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సందర్శించారు. యుద్ధాల్లో చనిపోయిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే, నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయిసేనాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బదూరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మువ్వెన్నల జెండాను ఆవిష్కరించాక... సైనిక దళాలు రిపబ్లిక్ పరేడ్ నిర్వహించాయి. త్రివిధ దళాల గౌరవ వందాన్ని రాష్ట్రపతి కోవింద్ స్వీకరించారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలతోపాటు... ఇతర భద్రతా దళాలు కవాతు నిర్వహించాయి.
రాజపథ్లో భద్రతా దళాల ప్రదర్శన తర్వాత... వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన నిర్వహించారు. బతుకమ్మ పండగను తెలుపుతూ... తెలంగాణ శకటం ప్రదర్శన ప్రత్యేకార్షణగా నిలిచింది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు... ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను తెలిపాయి..