జీహెచ్ఎంసీ ఎన్నికలు.. గ్రేటర్ హైదరాబాద్ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో GHMC ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కేటీఆర్ పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎస్.ఆర్.డి.పి పనులను పూర్తి చేసి నగర వాసులకు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
GHMCలో ఏళ్ల తరబడి తిష్ట వేసి కూర్చున్న IAS లను బదిలీ చేసింది ప్రభుత్వం. బల్దియాలో కమిషనర్ కాకుండా మరో ఆరుగురు IASలున్నారు. అందులో ఆరుగురు IASలను బదిలీ చేసి నలుగురు కొత్త వారిని అపాయింట్ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉన్న హరిచందనను నారాయణ్ పేట్ కలెక్టర్గా బదిలీ చేశారు. సెంట్రల్ జోన్ కమిషనర్గా ఉన్న ముషారఫ్ అలీను నిర్మల్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఎల్.బి నగర్ జోనల్ కమీషనర్గా ఉన్న సిక్త పట్నాయక్ ను పెద్దపల్లి కలెక్టర్గా బదిలీ చేశారు. వీళ్లే కాకుండా మరో ముగ్గురు IAS ఆఫీసర్లు అయిన సందీప్ కుమార్ ఝా ను అసిఫాబాద్ కలెక్టర్ గా, శ్రుతి ఓజాను గద్వాల్ కలెక్టర్గా, అద్వైత్ కుమార్ను సి.ఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా బదిలీ చేశారు.
GHMC నుండి ఆరుగురు IAS లను తప్పించి.. నలుగురు కొత్త వారిని బల్దియాలో అడిషనల్ కమీషనర్గా నియమించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా ఉన్న రాహుల్ రాజ్ను, వరంగల్ రూరల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న బాధవత్ సంతోష్ను, యాదాద్రి భువనగిరి స్పెషల్ ఆఫీసర్ను ప్రియాంక అలా, కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ప్రావీణ్యను GHMC అడిషనల్ కమీషనర్గా నియమించారు.
మేడ్చల్ జిల్లా ఏర్పడినప్పటి నుండి కలెక్టర్గా ఉన్న ఎం.వి.రెడ్డి ప్లేస్లో భూపాల పల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లను నియమించారు. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న మనిక్ రాజు ప్లేస్ లో శ్వేతా మహంతిని నియమించారు. రంగారెడ్డి కలెక్టర్గా సూర్యాపేట కలెక్టర్ అమెయ్ కుమార్ను నియమించారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్గా ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ గోపిను నియమించారు. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న IAS ఆఫీసర్లతో ఆశించిన స్థాయిలో పాలన జరగలేదని కొత్త వారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.