ఇవాళ మధ్యాహ్నం అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ జరనుంది. నేడు జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్తో తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ తలపడనుంది. అండర్ -19వరల్డ్ కప్లో ఐదో సారి ఛాంపియన్గా నిలిచేందుకు యువ భారత జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ సారి భారత్ ప్రత్యర్థి బంగ్లాదేశ్ కావడంతో.. కప్పు మనదే అని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ స్థాయిలో కూడా ప్రపంచకప్లో కనీసం ఫైనల్కు చేరుకోని బంగ్లా మరి ఏం చేస్తుందో చూడాలి.
ఈ ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండడం ఫ్యాన్స్ను భయపెడుతోంది. ఇవాళ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ రేపటిని రిజర్వ్ డేగా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో ఇరు జట్లూ అజేయంగా నిలిచాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను భారత్ ఓడించి భారత్ ఫైనల్కు చేరగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తే బంగ్లా జట్టు నుంచి తన్జీద్ హసన్ బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రాలతో మన పేస్ దళం పదునుగా కనిపిస్తుంటే అటువైపు నుంచి తన్జీమ్ హసన్, షరీఫుల్ ఇస్లామ్ తమ పేస్ పదును చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండా సెమీస్లో ఆడిన టీమ్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.