అమరావతి ఉద్యమం 67వ రోజుకు చేరుకుంది. దీక్షలు,ధర్నాలు, ఆందోళనలతో మార్మోగింది. అదే జోరుతో ఉద్యమాన్ని రైతులు కొనసాగుతోంది. శనివారం అమరావతి బంద్కు జేఏసీ పిలుపు నిచ్చింది. 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు జేఏసీ తెలిపింది. విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని కోరింది.
అసలే రాజధాని విషయంలో తమకు న్యాయం జరగట్లేదనే బాధలో రైతులు ఉండగా... అమరావతిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారిపై పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించడం పెద్ద దుమారానికి దారి తీస్తోంది. గ్రామాల్లో మహిళలు స్నానం చేస్తుంటే, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంపై మండిపడుతున్నారు.
పెనుమాక, ఎర్రబాలెం, నేలపాడు, కృష్ణాయపాలెం, మందడం, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి..తాడికొండ అడ్డరోడ్డు, నవులూరు, నిడమర్రులో ధర్నాలు చేపట్టారు. మిగతా గ్రామాల్లో ఆందోళనలు ఉద్ధృతం అయ్యాయి. అటు రైతులు 24 గంటల దీక్షలు చేపట్టారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని నినదిస్తున్నారు.
అటు ఉద్యమంపై పోలీసులు పెడుతున్న ఆంక్షలపై రైతులు మండిపడుతున్నారు. ధర్నా చేస్తే కేసు.. నిరసన తెలిపితే కేసు.. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదని రైతులు, మహిళలు స్పష్టంచేస్తున్నారు.. వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పోరాటంలో ప్రాణాలైనా అర్పిస్తామని తెగేసి చెప్తున్నారు.