శుభకార్యాల్లో మారుమోగుతున్న జై అమరావతి నినాదాలు

Update: 2020-02-27 10:38 GMT

ఏపీలో జై అమరావతి.. ఓ నినాదం కాదు.. ఇదో జీవన విధానంలా మారిపోయింది. రాజధానిలో 29 గ్రామాల్లో ఏ వేడుక జరిగినా.. ఏ కార్యక్రమం నిర్వహించినా జై అమరావతి అనే స్లోగన్స్‌తో మారుమోగుతున్నాయి. శుభకార్యాల్లోనూ జై అమరావతి అని నినదిస్తూ తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు రాజధాని మహిళలు, రైతులు.

నిరసన శిబిరాల్లోనేకాకుండా పుట్టిన రోజు వేడుకల్లోనూ జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. మందడంలో జరిగిన ఒక చిన్నబాబు పుట్టిన రోజు వేడుకల్లో రైతులు, మహిళలు జై అమరావతి అని నినదించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించి రాజధాని కోసం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

వెంకటపాలెం మాజీ ఎంపిటీసీ ప్రత్తిపాటి నాగమల్లేశ్వరరావు కుమారుడి నిశ్చితార్థం వేడుకల్లోనూ జై అమరావతి నినాదం వినిపించింది. నూతన వధూవరులు అమరావతే రాజధానిగా ఉండాలంటూ నినాదాలు చేశారు. అటు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో జరిగిన కార్యక్రమంలోనూ రాజధాని స్లోగన్సే హైలెట్‌గా మారాయి.

Similar News