చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు

Update: 2020-02-27 18:54 GMT

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా అనంతపురం జిల్లా కదిరిలో.. టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ గుండాలే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా.. 42 వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. అటు, చంద్రబాబు నిర్బంధాన్నినిరసిస్తూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌ రావు.. సత్తెనపల్లిలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్. ప్రతిపక్షనేతగా ప్రజలను కలుసుకునే హక్కు చంద్రబాబుకు ఉందన్నారు. విశాఖలో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందిన కనకమేడల ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దు, అదుపు లేకుండా పోయిందన్నారు.

Similar News