అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు సర్కారు చేస్తున్న కుట్రలు ఓపక్క.. కేసులు, ఆంక్షలతో భయపెడుతున్నా.. వాటిని ఎదిరించి నిలబడుతున్న రైతులు, మహిళలు ఒకపక్క. 5 కోట్ల ఆంధ్రుల కోసం తాము భూములిచ్చామంటున్న 29 గ్రామాలవాసులు వైసీపీ కక్షారాజకీయాలకు ఇప్పటికైనా ముగింపు పలకాలంటున్నారు. రాజధాని ఉద్యమానికి పోటీగా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు శిబిరాలు పెట్టి దీక్షలు చేసినా.. జనం వారిని నమ్మే పరిస్థితి లేదంటున్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నామని, పాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతిని చంపేయొద్దని వేడుకుంటున్నామని రైతులు చెప్తున్నారు. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న భవనాలకు 2 వేల కోట్లు కేటాయించి పూర్తి చేస్తే అమరావతి నుంచే సమర్థంగా పాలన సాగించే వీలుంటుందని గుర్తు చేస్తున్నారు. మంగళవారం కూడా మందడం, తుళ్లూరులో ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో 84వ రోజు దీక్షలు కొనసాగిస్తున్నారు. పెనుమాక, కృష్ణాయపాలెం, ఉండవల్లి సహా అన్ని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.