కరోనాపై ఆందోళన వద్దు.. అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తాం : కేసీఆర్
కరోనా వైరస్పై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కరోనాపై భయం, ఆందోళన వద్దుని.. కట్టడి చేసేందుకు అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ముందు జాగ్రత్తగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ప్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో కరోనా అధికంగా ప్రబలిందన్నారు కేసీఆర్. దీంతో ఈ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్ చేసి.. నెగిటివ్ అని తేలితేనే బయటకు పంపాల్నది కేంద్ర ప్రభుత్వం సూచన అని తెలిపారు. గత వారం రోజుల నుంచి అప్రమత్తంగా ఉన్నామని.. 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉండి పరీక్షలు నిర్వహిస్తున్నారు చెప్పారు సీఎం.
కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. కరోనా వంటి సున్నిత అంశాలను రాజకీయం చేయొద్దని అన్నారు..ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్.. కాంగ్రెస్సే అని విమర్శించారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడం లేదనే మాటలు సరికాదన్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించనున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారంతోనే ముగించాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో సభ నిర్వహించి.. ఆఖరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.