హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్లో కరోనా కలకలం రేగింది. ఎవరి కంటా పడకుండా ట్రైన్ ఎక్కారు ఇద్దరు యువతీ యువకులు. అయితే అమ్మాయికి వేసిన మార్కును గుర్తించారు తోటి ప్రయాణికులు. ఆ మార్కులేంటి అని ప్రశ్నించారు. టాటూ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసిందామె. కానీ అనుమానంతో గట్టిగా నిలదీసే సరికి అసలు విషయం చెప్పారు. తమను వికారాబాద్ వైద్యులు చెక్ చేశారని.. కరోనా అనుమానితులుగా భావించి ఏప్రిల్ 5 వరకు ఎక్కడికీ వెళ్లొద్దని ఆదేశించారని తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు విషయం తెలియజేశారు తోటిప్రయాణికులు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కాజీపేట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆపేసి.. వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. ఆ ఇద్దరూ ప్రయాణించిన కోచ్ B-3లోని ప్రయాణికులందర్నీ వేరే బోగీల్లోకి షిఫ్ట్ చేశారు. తర్వాత ఆ బోగీని పూర్తిగా శానిటైజేషన్ చేశారు. అంతా ఓకే అయ్యింది అనుకున్నాక.. ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. B-3 బోగీని మొత్తం ఖాళీ చేశారు.