కరోనాపై 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలి : సుప్రీం కోర్ట్

Update: 2020-04-01 09:57 GMT

దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రజలు వలస రాకుండా నిరోధించాలని ఆదేశించింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ నాగేశ్వరరావుల బెంచ్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

‘శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా భారతదేశంలో 1,238 COVID-19 కేసులు ఉన్నాయని.. అలాగే వైరస్ కారణంగా 35 మంది మరణించగా, 123 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Similar News