కరోనా మహమ్మారి దేశంలో వేగంగ విజృంభిస్తోంది. ఈ కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో చాల మంది ఉపాధి లేక, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మన దేశంలో ప్రస్తుతం లక్షలాది మంది తిండి లేక అల్లాడుతున్నారు. అందులో ప్రధానంగా వలస కూలీలు, రోడ్డు పక్కన యాచన చేసి జీవించే వాళ్లు ఉన్నారు. ఇలాంటి వారి కడుపు నింపడం కోసం చెన్నై నగరపాలక సంస్థ అధికారులు అమ్మ క్యాంటీన్లను ఉపయోగిస్తున్నారు. సాధారణ రోజుల్లో అమ్మ క్యాంటీన్ల ద్వారా రోజు 5 లక్షల మందికి భోజనం అందిచేవారమని, ఇప్పుడు కరోనా నేపథ్యంలో రోజుకు 11 లక్షల మందికి భోజనం పెడుతున్నామని చెన్నై నగర కార్పోరేషన్ కమిషనర్ జీ ప్రకాష్ తెలిపారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణ కోసం అవసరమైన సరుకులు సమృద్ధిగా ఉన్నాయని, లాక్డౌన్ ఎన్నిరోజులు కొనసాగినా ఈ క్యాంటీన్లు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.