అమేథీలో ఉన్న పేదల కోసం రాహుల్ గాంధీ నిత్యావసర సరుకులు పంపించారు. ఈ మేరకు అమేథీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ సింగ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పేద ప్రజలకు పంచడానికి ఐదు ట్రక్కుల్లో బియ్యాన్ని, మరో ట్రక్కు నిండా పప్పు దినుసులు, వంట నూనె, సుగంధ ద్రవ్యాలతో పాటు మరికొన్ని నిత్యావసరాలను పంపినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకూ 16,400 నిత్యావసరాల కిట్లను, 877 మందికి అందజేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా రాహుల్ గాంధీ తరపున 50 వేల మాస్కులను, 20 వేల శానిటైజర్స్, సబ్బులను పేద ప్రజలకు పంపిణీ చేసినట్లు ప్రకటించారు. లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయి.. తినడానికి తిండి కూడా లేని వారు.. ఆకలితో ఉండకూడదని రాహుల్ ఈ చిన్న ప్రయత్నం చేశారని అమేథీ కాంగ్రెస్ నేతలు తెలిపారు.