అగ్రరాజ్యం అమెరికా అన్నింటా అగ్రపథంలోనే పయనిస్తుంది. ఆఖరికి కరోనా కేసుల విషయంలోనూ. ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా కబళించినా అమెరికాను మాత్రం ఈ వైరస్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవడం అగ్రరాజ్య అధినేతను కలవరపాటుకు గురి చేసింది.
అయితే గడిచిన 24 గంటల్లో కరోనా.. అమెరికాపై తనప్రభావాన్ని కాస్త తగ్గించినట్లుంది. మరణాల సంఖ్య 1738గా నమోదైంది. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు అక్కడ 8,52,703 మంది వైరస్ బారిన పడగా 47,750 మంది మృతి చెందారు. ప్రపంచంలోని మరే ఇతర దేశం ఇంతగా ఎఫెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో కరోనా.. అమెరికాను మరింత కలవరపెడుతుందని అక్కడి వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వింటర్ సీజన్లో కరోనా వైరస్తో పాటు, ఫ్లూ కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.