ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వారు వీరు అని తేడాలేకండా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపుతోంది. తాజాగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ఐదుగురికి కరోనా సోకింది. కరోనా వైరస్ బారిన బడిన ఐదుగురిలో ముగ్గురు ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో అత్యవసర సేవల్లో పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరిలో 50వ బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని, వారు హర్యానాలోని ఎయిమ్స్లో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ బెటాలియన్ ఢిల్లీలో శాంతి భద్రతల విధుల్లో ఉన్నదని ఆ రాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు. ఐటీబీపీకి చెందిన సుమారు 90 మంది క్వారంటైన్లో ఉన్నారని వెల్లడించారు.