అస్సాంలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు మరణించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 3.81 లక్షలకు పైగా ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్డిఎంఎ) ప్రకారం గురువారం నుంచి గోల్పారా జిల్లాలోని లఖిపూర్, హోజాయ్లోని డోబోకా వద్ద ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో గల్లంతయ్యారు. అంతకుముందు ఒకరు మరణించగా.. శుక్రవారం మరో ఇద్దరు మరణించారు.. దాంతో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించినట్టు తెలిపారు. అస్సాంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, దాని అనుబంధ ఉపనదుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం అస్సాంలోని నల్బరి, గోల్పారా, నాగావ్, హోజాయ్, వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్, దిబ్రుగర్ ,టిన్సుకియా జిల్లాల్లో 356 గ్రామాల్లో మొత్తం 381,320 మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు కారణంగా సహాయక శిబిరాలవద్దకు 22,000 మంది ప్రజలను చేర్చినట్టు తెలిపారు.. మొత్తం 4 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 190 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో 16,300 మంది గోల్పారా వద్ద ఉన్నారు. హోజాయ్ శిభిరంలో 5299 ఉన్నారు.