దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రామ్చరణ్ తేజ్, ఉమాపతిరావు మనవరాలు ఉపాసన హాజరయ్యారు. ఈ ఉదయం భౌతికదేహాన్ని గడికోటలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం స్థానిక లక్ష్మీబాగ్కు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చిరంజీవితో సహా పలువురిపై తేనేటీగలు దాడి చేశాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఉమాపతిరావు అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అనిల్కుమార్ కామినేనితో పాటు కూతురు శోభ ఉన్నారు. అంతకు ముందు ఉమాపతిరావు పార్థివదేహానికి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అమెరికాలో స్థిరపడిన కూతురు శోభ, అల్లుడు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలు ఇవాళ జరిగాయి.