అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఆఫ్రో అమెరికన్ల ఆందోళనలతో అన్ని రాష్ట్రాలు అట్టుడుతుకుతున్నాయి. ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెలంచుకోవడంతో ఏకంగా అమెరికా అధ్యక్షుడే తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆందోళనకారులు వైట్హౌజ్లోకి దూసుకొచ్చి దాడులు చేయడంతో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంకర్లోకి వెళ్లిపోయాడు. ట్రంప్ గంటకుపైగా బంకర్లోనే ఉన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ప్రథమ మహిళ మెలానియా, కుమారుడు బ్యారన్ కూడా బంకర్లోకి వెళ్లి తలదాచుకున్నారు.
ఆందోళనకారులు వైట్హౌజ్లోకి చొచ్చుకురావడంతో.. అప్రమత్తమైన శ్వేతసౌధం భద్రతా సిబ్బంది.. ఉత్తరం వైపు లైట్లు ఆర్పేశారు. నిజానికి, అధ్యక్షుడు మరణిస్తేనే ఇలా చేస్తారు. కానీ, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో లైట్లు ఆర్పివేయక తప్పలేదు. భద్రతాధికారుల వద్ద నైట్విజన్ పరికరాలు ఉండడంతో నిరసనకారులను చీకట్లో ఉంచేందుకు లైట్లు ఆర్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను చూసి ట్రంప్ కుటుంబం భయపడిపోయినట్లు ఓ రిపబ్లికన్ పార్టీనేత చెప్పారు. ట్రంప్ శుక్రవారం కూడా బంకర్లోకి వెళ్లినట్లు సమాచారం.
ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వైట్హౌజ్ను వదిలి రావడం లేదు. నిరసనకారులు వేలాదిగా తరలిరావడంతో శ్వేతసౌధం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను బంకర్లోకి తరలించారు. సాధారణంగా ఉగ్రదాడుల వంటి ఘటనలు జరిగిన సమయంలోనే అధ్యక్షుడు వైట్హౌజ్లోని బంకర్లోకి వెళ్తారు. సురక్షిత స్థావరం కావడంతో అక్కడి నుంచే తన అధికారిక కార్యకలాపాలను నిర్వహిస్తారు.