బురుండీ అధ్యక్షుడు ఎన్కురుంజిజా(55) హఠాన్మరణం చెందారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు బురుండి ప్రభుత్వం తెలిపింది. శనివారం మధ్యాహ్నం జరిగిన వాలీబాల్ మ్యాచ్కు ఎన్కురుంజిజా హాజరయ్యారు.. అయితే ఆ సమయంలో అనారోగ్యం పాలయ్యారని దీంతో ఆసుపత్రికి తరలించారని ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ క్రమంలో ఆదివారం కోలుకున్నట్లు కనిపించడమే కాకుండా మనుషులతో కూడా మాట్లాడారు.. అయితే సోమవారం ఉదయం నుంచి ఆయన పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. ఆ తరువాత అతను గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ తూర్పు బురుండిలోని కరుజీలోని ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవలే ఎన్కురుంజిజా సతీమణి డెనిస్ ఎన్కురుంజిజాకు కరోనా సోకింది. దాంతో ఆమె కెన్యాలో అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. భార్య ఆసుపత్రుల్లో ఉండగానే ఎన్కురుంజిజా మరణించడంతో బురుండీ ప్రజలు పెనువిషాదంలో మునిగిపోయారు.