పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్నాటక తోపాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, కోస్తాంధ్ర, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అల్పపీడనం ఏర్పడింది. రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది.
ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, తూర్పుగోదావరిజిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తెలంగాణాలోని ఉమ్మడి మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది.