వరుసగా రెండో రోజూ అప్పర్ సర్క్యూట్తో ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచెత్తుతోంది రాంకో సిస్టమ్స్. గురువారం కూడా ఈ షేర్ 20శాతం అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయింది. దీంతో గత రెండు రోజుల్లో ఈ షేర్ 44శాతం రిటర్న్స్ అందించినట్లయింది. మంగళవారం రూ.76.65 స్థాయి వద్ద ఉన్న రాంకో సిస్టమ్స్ గురువారం రూ.110.30కు చేరింది.
జూన్ 10న కంపెనీలో ఇన్వెస్టర్ విజయ్ కేడియా 1.1 వాటాను రూ.3 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ కౌంటర్ సెంటిమెంట్ బలపడింది. రాంకో సిస్టమ్స్లో ఒక్కో షేరు రూ.87.82 చొప్పున మొత్తం 3,39,843 షేర్లను విజయ్ కేడియా కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికం వరకు ఈ సంస్థలో విజయ్ కేడియాకు ఎలాంటి వాటా లేదు.
ఈ ఏడాది మార్చి 25న రాంకో సిస్టమ్స్ 52వారాల కనిష్ట స్థాయి రూ.64.10కు పడిపోయింది. ఆ స్థాయి నుంచి కోలుకున్న రాంకో సిస్టమ్స్ ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇక గత ఏడాది జూన్ 11న 52 వారాల గరిష్ట స్థాయికి రూ.232కు ప్రస్తుతం 50శాతం దిగువన షేర్ కదలాడుతోంది.
విజయ్ కేడియాకు చెందిన కేడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్మాల్క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రెప్రో ఇండియా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్, అతుల్ ఆటో, సెరా శానిటరీవేర్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, కొకుయో కామ్లిన్లో ఈ సంస్థ వాటాలను కలిగివుంది.