నీ ఆవేదన తెలుసు.. నిన్ను బాధించిన వ్యక్తులూ తెలుసు: దర్శకుడు శేఖర్ కపూర్
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం అందర్నీ కలిచి వేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న మంచి నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించడం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతడి మరణానికి కారణం తెలిసినా మౌనంగా ఉంటున్నవారు కొందరైతే.. మరి కొందరు తమ భావాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత శేఖర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సుశాంత్ ను ఆత్మహత్యకు పురిగొల్పిన అంశాలు తనకు తెలసునని ఆయన ట్వీట్ చేశారు.
'నువ్వు ఓ సారి నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. నువ్వు పడ్డ ఆవేదన, నిన్ను దారుణంగా బాధించిన వ్యక్తుల కథలు నాకు తెలుసు. ఇదంతా భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. గత ఆరు నెలలుగా నేను నీ దగ్గర ఉండి ఉంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసి ఉండాల్సింది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు సుశాంత్' అని పోస్ట్ పెట్టారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటి ఇలా చేసి ఉండకూడదు అని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
యశ్ రాజ్ బ్యానర్ లో శేఖర్ కపూర్ 'పానీ' చిత్రాన్ని సుశాంత్ ని హీరోగా పెట్టి తీయడానికి స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు. సినిమాకు సంబంధించిన చర్చలన్నీ అయిపోయాయి. అంతా ఓకే అనుకున్న టైమ్ లో యశ్ రాజ్ సంస్థ వెనక్కు తగ్గింది. దీంతో 2015లో రావాల్సిన 'పానీ' చిత్రం ఆగిపోయింది. అప్పట్లో శేఖర్ కపూర్ దీని గురించి బాధపడుతూ 'పానీ' సినిమా ఆగిపోయినందుకు ఎంతగానో బాధపడుతున్నా. కానీ ఓ చిత్రం కోసం నీలా కష్టపడే నటుడ్ని నేను ఇంతవరకు చూడలేదు అని ట్వీట్ చేశారు.