ప్రజారవాణా విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీఎస్ఆర్టీసీ.... కార్గో సేవలు సైతం ప్రారంభించింది. శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్శిల్ సేవల కోసం కార్గో సర్వీసులను ప్రారంభించారు. ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్ నుంచి బస్సులను ప్రారంభించారు. పార్శిల్ కొరియర్ సేవల వివరాలు సంస్థలో చేపట్టిన కార్యాచారణ ప్రణాళికలకు సంబంధించిన విషయాలతో రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. వేగంగా, భద్రంగా, చేరువగా అనే ట్యాగ్లైన్తో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు..
తొలి దశలో 104 కార్గో బస్సుల సేవలు అందుబాటులో తెస్తున్నారు. కార్గో సేవలను విస్తృతపరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్టుగానే, సరకు రవాణా కూడా చేస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, తదితరులు పాల్గొన్నారు.