పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఆదివారం కారు ప్రమాదంలో మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తాను మరణించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని , అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్న ఇర్ఫాన్.. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను ఎందుకు షేర్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఫేక్ న్యూస్ ద్వారా తన కుటుంబసభ్యులు మరియు స్నేహితులు కలవరపాటుకు గురయ్యారని.. ఇకనుంచి ఎవరి విషయంలో అయినా అలాంటి వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరారు. కాగా ఆదివారం మహ్మద్ ఇర్ఫాన్ ట్వీటర్ తోపాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా కారు ప్రమాదంలో ఇర్ఫాన్ మృతి చెందాడంటూ వార్త వైరల్ అయింది. 38 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్.. పాకిస్తాన్ తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 22 టీ20లు ఆడాడు.