చేపల వ్యాపారి నుంచి 119 మందికి..

Update: 2020-07-09 18:12 GMT

కేరళలోని పుంథూరా గ్రామంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడికి ఆరు ప్రత్యేక బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. మొట్ట మొదట ఇక్కడ ఓ చేపల వ్యాపారికి కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, కలిసిన వారికి టెస్ట్ చేయగా 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ వ్యాపారి తమిళనాడులోని ఓ స్థానిక మార్కెట్లో చేపలు విక్రయిస్తుంటాడని తెలిసింది. పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనాధారం సాగిస్తుంటారు. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది పుంథూరా, తిరువనంతపురం నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Similar News