పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై ఆ రాజవంశస్తులకు హక్కు ఉంది : సుప్రీంకోర్టు
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణలో రాజవంశస్తులకు హక్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేవాలయ నిర్వహణ మరియు వ్యవహారాల నుండి రాజకుటుంబానికి చెందిన అన్ని హక్కులను తొలగించే విధంగా గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. జస్టిస్ ఉదయ్ యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. ఆలయ నిర్వహణలో రాజవంశస్తుల పాత్రను సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. 1991 లో ఆలయానికి చెందిన చివరి పాలకుడు మరణించినంత మాత్రాన ఆలయ ఆస్తులను రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతేకాదు ఒకరి మరణం వల్లనో దైవారాధనకు చెందిన హక్కులు ఆ కుటుంబంపై ప్రభావం చూపలేవని.. ఇది ఆలయ సనాతన సంప్రదాయం ప్రకారం కొనసాగుతుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇప్పుడు ఆలయ ఏర్పాట్లను పరిశీలిస్తుందని సుప్రీం తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రధాన కమిటీ ఏర్పడే వరకు ఈ వ్యవస్థ అమలులో ఉంటుందని.. కమిటీలో రాజకుటుంబం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పింది. అయితే ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాత్రం సుప్రీం స్పందించలేదు.