ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక బ్రెజిల్లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెజిల్ దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకూ వేలల్లో నమోదవుతుండడం కలవర పెడుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 24 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా బారిన పడి 500 మంది మృతి చెందారని బ్రెజిల్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రెజిల్లో ఇప్పటివరకు 2.4 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. ఇక కరోనా మహమ్మారి నుంచి 1.63 మిలియన్ల మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 87 వేల మందికి మృతి చెందారు. అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం.