దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ మహమ్మారి ప్రతీ రోజు సుమారు వెయ్యి మందిని పొట్టన పెట్టుకుంటుంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా మనోజ్ శ్రీవాస్తవ అనే ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కరోనాతో మృతి చెందారు. బీహార్ కేడర్ కు చెందిన ఆయన ఇటీవల కరోనాతో పాట్నాలోని ఎయిమ్స్ లో చేరారు. అయితే, కరోనా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. 1980 బ్యాచ్ కు చెందిన ఆయనకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. పలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన వ్యూహాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. బీహార్ విపత్తు నిర్వహణ విభాగం వ్యవస్థాపక కార్యదర్శిగా గొప్ప పేరు గడించారు. యూఎన్ డీపీ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కింద 2007లో బీహార్లో వరదల సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.