AP: భవన నిర్మాణ అనుమతులకు నూతన మార్గదర్శకాలు
అలా చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ప్రభుత్వం.. కొత్తగా సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్;
ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ అనుమతుల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులపై ఏపీ సర్కారు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణ అనుమతులపై ఏపీ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సీఆర్డీఏ మినహా అన్ని చోట్లా అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గానూ భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ ఆదేశాలిచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు.
తాజా మార్గదర్శకాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను.. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు జారీ చేయనున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో మాత్రం ఇది అమల్లో ఉండదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఆర్డీఏ తప్ప మిగతా అన్ని చోట్లా భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారాన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. ఇంతకుముందు ఈ అధికారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఉండేది. అయితే భవన నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం.. ఈ అధికారాన్ని పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. స్వయంగా యజమానులు లేదా ఆర్కిటెక్టు, ఇంజనీర్లు, టౌన్ప్లానర్లు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది.
కఠిన చర్యలు తప్పవు
లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం. ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నా సంబంధిత భవన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని పురపాలకశాఖ స్పష్టం చేసింది.