సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు మరో బిగ్ షాక్ తగిలింది. జత్వానీ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మెన్ గా ఉన్న సమయంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఆన్సర్ షీట్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక కేసును ఏసీబీకి బదిలీ చేస్తారని సమాచారం. ఇప్పటికే.. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్ట్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంజనేయులు.. జనవరి 31, 2024న, ఎఫ్ఐఆర్ దాఖలు కాకముందే.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలను ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశానికి పిలిచి, కాదంబరి అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 2న ఎఫ్ఐఆర్ దాఖలైన కొన్ని గంటల్లోనే కాదంబరి, ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. వారు 42 రోజులపాటు న్యాయస్థాన రిమాండ్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె కూటమి ప్రభుత్వం హయాంలో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దోషులు ఎంతటివారైనా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చి.. కేసును సీఐడీ అప్పగించింది.