KUPPAM: బిరబిరా కృష్ణమ్మ పరిగెడుతుంటేను..
నెరవేరిన కుప్పం ప్రజల దీర్ఘకాల స్వప్నం... కుప్పానికి చేరుకున్న కృష్ణమ్మ నీళ్లు.... హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలు పరుగులు... కృష్ణ జలాలకు దిగి పూజలు నిర్వహించిన రైతులు;
కుప్పం ప్రజల దీర్ఘకాల స్వప్నం చివరికి నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీళ్లు చేరాయి. రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, సంబరాలు చేసుకున్నారు. కొందరు జంతు బలులిచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదని హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రైతులు ప్రశంసించారు. గత ప్రభుత్వంలో జగన్.. సినిమా సెట్ వేసి కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తున్నామని జగన్నాటకం ఆడారని గుర్తుచేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి కృష్టమ్మను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణ కుప్పం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పటికే పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ఈనెల 30వ తేదీనాటికి చెరువు నిండి మొరవపారి, కింద చెరువు కూడా నిండుతుందని తెలిపారు. అలా నియోజకవర్గంలోని 240 చెరువులు నిండటం ఖాయమన్నారు. 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. పరమసముద్రం చెరువు సమీపంలో జలహారతి ఇవ్వనున్నారు. దీని కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ నాటికి నీళ్లు తెస్తామనే హామీ ఇచ్చిన చంద్రబాబు, మూడునెలల ముందుగానే ఈ వాగ్దానాన్ని నెరవేర్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు తిరిగి నిండిపోతాయని రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఈ జలాల రాకతో రైతుల కష్టాలు తీరనున్నాయి. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 554 చెరువులు ఉన్నాయి.
220.35 కి.మీ.. 16 లిఫ్టులు
కృష్ణా జలాలను తరలించేందుకుగాను హంద్రీ- నీవా ఎత్తిపోతల పథకంలో మొత్తం 38 లిఫ్టులు నిర్మించారు. ఇందులో పుంగనూరు ఉప కాలువలో 16 ఉన్నాయి. లిఫ్టులకు అవసరమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు రెండు 220 కె.వి. ఉప కేంద్రాలను నిర్మించారు. బొంతలపల్లె నుంచి ప్రారంభమయ్యే పుంగనూరు ఉప కాలువ 220.35 కి.మీ మేర ప్రవహించి కుప్పం ఉప కాలువలో కలుస్తుంది. పుంగనూరు ఉప కాలువలో లైనింగ్, విస్తరణ పనులకు రూ. 480.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న ప్రకారం 90 శాతం పనులు పూర్తయ్యాయి. లైనింగ్ పనులకు 250 రకాల యంత్రాలు, వాహనాలను వినియోగించారు. 700 మంది కార్మికులు గత నాలుగు నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించారు.