భారత్ ఇంగ్లాడ్ టెస్ట్ సిరీస్ హైలైట్స్
150 కిలోమీటర్ల వేగంతో వుడ్ వేసిన రెండు బంతులను స్ట్రయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించిన తీరు అమితంగా ఆకట్టుకుంది.;
ఇంగ్లండ్తో ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–2తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్కు 10.44 రన్రేట్తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వుడ్ వేసిన రెండు బంతులను స్ట్రయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరు బంతుల వ్యవధిలో మరో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టోక్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లి 52 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. రోహిత్ అవుటయ్యే సమయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేసిన కెప్టెన్ తర్వాతి 32 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. వుడ్, స్టోక్స్ బౌలింగ్లో ఒక్కో సిక్స్ కొట్టిన అతను వుడ్ మరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ భారీ స్కోరులో మరో ఎండ్ నుంచి హార్దిక్ కూడా కీలకపాత్ర పోషించాడు. జోర్డాన్ ఓవర్లో వరుస బంతుల్లో పాండ్యా కొట్టిన రెండు సిక్సర్లు టీమిండియా స్కోరును 200 పరుగులు దాటించాయి. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్ స్కోరు వేగం తగ్గలేదు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు బంతులను సూర్య భారీ సిక్సర్లుగా మలచడం విశేషం. ఆ తర్వాత జోర్డాన్ బౌలింగ్లో అతను వరుసగా మూడు బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు హైలైట్గా నిలిచాయి. వేగంగా కోహ్లి స్కోరును దాటేసిన అనంతరం జోర్డాన్ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 46 బంతుల్లో 68, జోస్ బట్లర్ 34 బంతుల్లో 52 పరుగులతో దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు.