Mohammed Siraj: 'క్రికెట్ మానేసి ఆటో నడుపుకో': యంగ్ క్రికెటర్పై తీవ్ర విమర్శలు
Mohammed Siraj: 2019 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ను మరోసారి గుర్తుచేసుకున్న సిరాజ్.. తన ఆట బాలేదని ఒప్పుకున్నాడు.
Mohammed Siraj: సెలబ్రిటీలు అవ్వాలంటే మామూలు విషయం కాదు.. ఎన్నో అవమానాలు ఎదుర్కున్న తర్వాతే సెలబ్రిటీల స్థాయికి ఎదిగుంటారు. క్రికెటర్స్ అయినా, సినీ సెలబ్రిటీలు అయినా.. ఒక్క అడుగు నుండి జీవితాన్ని మొదలుపెట్టాల్సిందే. అలా తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న సంఘటనల గురించి బయటపెట్టాడు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.
ఐపీఎల్ అనేది ఏ క్రికెటర్ లైఫ్లో అయినా చాలా కీలకం. అందులో ఉన్నత ప్రతిభ కనబరిస్తేనే.. టీమిండియా టీమ్కు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఐపీఎల్ అనేది కొంతమంది ట్రోల్స్కు గురయ్యేలాగా కూడా చేస్తుంది. అలా 2019లో ఆర్సీబీ తరపున ఆడిన సిరాజ్ కూడా తన ఆటతో అందరినీ మెప్పించలేక నెగిటివిటీని ఎదుర్కున్నాడు.
2019 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ను మరోసారి గుర్తుచేసుకున్న సిరాజ్.. తన ఆట బాలేదని ఒప్పుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ అయిపోయిందేమో అని భయపడ్డానని సిరాజ్ అన్నాడు. కానీ తనకు ఆర్సీబీ మరో అవకాశం అందించింది. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్లో సిరాజ్ బాగా రాణించినా.. 2019 మ్యాచ్ను మాత్రం చాలామంది మర్చిపోలేదు. ఆ సమయంలో తనను చాలామంది చాలా తీవ్రంగా విమర్శించారు అన్నాడు సిరాజ్.
'నీకు క్రికెట్ ఎందుకు? మానేసి మీ నాన్నతో కలిసి ఆటోలు నడుపుకో' అంటూ తనను విమర్శించారని గుర్తుచేసుకున్నాడు సిరాజ్. అయితే ఆ సమయంలో తనకు ధోనీ మాటలే మోటివేషన్ ఇచ్చాయని అన్నాడు. బాగా ఆడితే పొగిడేవారు, సరిగ్గా ఆడకపోతే తిడతారని, అవన్నీ పట్టించుకోవద్దని ధోనీ చెప్పాడట. ఆ మాటలే తనకు ధైర్యాన్ని ఇచ్చాయని సిరాజ్ తెలిపాడు.