Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డు
8,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా విరాట్;
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు . 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నయా రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోహ్లీ ఈ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు.
గత రాత్రి రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వ్యక్తిగత స్కోరు 29 పరుగుల వద్ద విరాట్ 8,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 6,769 పరుగులతో ఉన్నాడు.
కాగా ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ని ప్రదర్శించాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఏకంగా 741 పరుగులు బాదాడు. 64 సగటు, 155 స్ట్రైక్ రేట్తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్లో కోహ్లీ ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే ఆర్సీబీ కల వరుసగా 17వ సారి చెదిరింది. ముఖ్యంగా సుదీర్ఘకాలం నుంచి విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే ..
విరాట్ కోహ్లి – 252 మ్యాచుల్లో 8004 పరుగులు
శిఖర్ ధావన్ – 222 మ్యాచుల్లో 6769 పరుగులు
రోహిత్ శర్మ – 257 మ్యాచుల్లో 6628 పరుగులు
డేవిడ్ వార్నర్ – 184 మ్యాచుల్లో 6565 పరుగులు
సురేశ్ రైనా – 205 మ్యాచుల్లో 5528 పరుగులు