మదనపల్లి జంట హత్యల కేసు..రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు
పెద్ద కూతురు చెప్పినట్టుగానే పురుషోత్తంనాయుడు, పద్మజ కలిసి అలేఖ్య నోటిలో కలశం పెట్టి డంబెల్తో తలపై కొట్టారు.;
మదనపల్లి జంట హత్యల కేసులో మిస్టరీ కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను మూఢ భక్తితో హత్య చేసిన దంపతులు పురుషోత్తంనాయుడు, పద్మజ ప్రస్తుతం మదనపల్లె సబ్జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలకాంశాలను పేర్కొన్నారు.
అలేఖ్య, సాయిదివ్య కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారని... మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తాను చనిపోతాననే భావనతో సాయిదివ్య ఉండగా.. ఆ అనుమానం నిజమేనని అలేఖ్య బలపరుస్తూ వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 23న తల్లిదండ్రులు మంత్రగాడితో తాయత్తు కట్టించారని.. అప్పటికీ సాయిదివ్యలో ఈ భావన తగ్గలేదని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు.
మరుసటిరోజు తాను చనిపోతానని సాయిదివ్య బిగ్గరగా ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారని.. ఈ క్రమంలో మరింత గట్టిగా ఏడవడంతో.. ఈసారి దెయ్యాన్ని వదిలించాలని డంబెల్తో తలపై మోది.. తర్వాత నుదుటిపై కత్తితో కోశారని రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది.
ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. పెద్ద కూతురు చెప్పినట్టుగానే పురుషోత్తంనాయుడు, పద్మజ కలిసి అలేఖ్య నోటిలో కలశం పెట్టి డంబెల్తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా మరణించిందని తెలిపారు.
జంట హత్యల తర్వాత గౌరీశంకర్ అనే విశ్రాంత అధ్యాపకుడి సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు.. పురుషోత్తంనాయుడు ఇంటికి వెళ్లారు. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గ్లాసు ముక్కలు కనిపించాయి. రాత్రి 9.30 గంటలకు తాలూకా స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
నిందితులిద్దరినీ 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. దంపతులిద్దరినీ తిరుపతిలోని మానసిక వైద్యశాలకు తరలిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని మదనపల్లె జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక నివేదిక ఇచ్చారు. ఈ మేరకు వారిద్దరినీ వైద్యశాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే.. వారిని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.