హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరో తమ బిడ్డను పొట్టనబెట్టుకుంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఆరోపిస్తూ నితిన్ తల్లిదండ్రులు, బంధువులు నిమ్స్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికైనా అధికారులు వాస్తవమేంటో బయటపెట్టాలని జూనియర్ డాక్టర్లు, నితిన్ సహచరులు, మిత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు.. మీ సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థి మృతిపై వెంటనే స్పందించాల్సిన అవసరముంది, ఎలా నితిన్ మృతి చెందాడు తెలుసుకుని ప్రకటన చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.
"కేసీఆర్ ముందుచూపుతోనే మెడికల్ పార్క్"
ఒకప్పుడు గుట్టలు, స్టోన్ క్రషర్ లతో నిండి ఉన్న సుల్తాన్ పూర్ ప్రాంతాన్ని మెడికల్ పరికరాల రంగంలో ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు అన్నారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్క్ లో HUWEL లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.