వైద్యుడి నిర్లక్ష్యం.. 7ఏళ్ల బాలుడి ఎడమ కంటి చికిత్స కోసం వెళితే కుడి కంటికి..
గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో ఎడమ కంటికి శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఏడేళ్ల బాలుడి కుడి కన్నుకు ఆపరేషన్ చేశారు.;
వైద్యుల నిర్లక్ష్యం ఒక్కోసారి పేషెంట్ ప్రాణాల మీదకు తెస్తుంది. గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో ఎడమ కంటికి శస్త్ర చికిత్స చేసేందుకు వెళ్లిన ఏడేళ్ల బాలుడి కుడి కన్నుకు ఆపరేషన్ చేశారు. నవంబర్ 12న సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది.
బాలుడి తండ్రి నితిన్ భాటి తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమకంటి నుంచి తరచూ నీరు వస్తుండటంతో వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన తర్వాత, వైద్యుడు ఆనంద్ వర్మ, అతని కంటిలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఉందని - ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని చెప్పారు.
ఆపరేషన్కు ₹ 45,000 ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం యుధిష్ఠిర్ అనే బాలుడికి వైద్యుడు ఆపరేషన్ నిర్వహించారు.
ఇంటికి చేరుకోగానే బాలుడి తల్లి సమస్య ఎడమ కంటికి అయితే కుడి కంటికి ఆపరేషన్ జరిగిందని గమనించింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని నిలదీశారు. అతని తల్లిదండ్రులు డాక్టర్తో గొడవపడ్డారు. అయితే అతను, అతని సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు తెలిపారు.
ఆసుపత్రిలో గొడవ సృష్టించిన కుటుంబ సభ్యులు గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)కి ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి, తన ఫిర్యాదులో, డాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ ప్రారంభించామని, త్వరలో తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.