9 States Elections: త్వరలో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్
9 States Elections: త్వరలో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మొదట త్రిపుర రాష్ట్రంపై దృష్టి సారించింది.;
9 States Elections: త్వరలో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మొదట త్రిపుర రాష్ట్రంపై దృష్టి సారించింది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు త్రిపుర సీఎం మాణిక్ సాహా, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, బీజేపీ అభ్యర్థుల ఖరారుపై మోదీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రిపురలో బీజేపీ దూకుడు పెంచింది. ఆకర్ష్ లోటస్కు పదును పెట్టింది. కమలం వ్యూహంలో భాగంగా త్రిపుర బీజేపీలో వలసలు జోరందుకున్నాయి. త్రిపుర టీఎంసీ మాజీ చీఫ్ సుబల్ భౌమిక్, సీపీఎం నేత మొబోషర్ అలీ బీజేపీలో చేరారు.
ఇద్దరు నేతల చేరికతో త్రిపురలో పార్టీ మరింత బలపడుతుందని సీఎం మాణిక్ సాహా అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి.
మార్చి 2న ఫలితాలు వెలువడతాయి. అయితే త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి 2018లో తొలిసారిగా త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు గాను 36 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చింది.